రావలూ అనే చేపల కథ
ఏ.యం. ఖాన్. యజ్దానీ (డానీ)
గోదావరి పశ్చిమ గట్టున నర్సాపురం మాఊరు. ఒక మేజరు కాల్వ, మూడు పంట కాల్వలు, ఒక గోదావరి, ఒక సముద్రం మా ఊరి ప్రత్యేకతలు.
మూడుకాదు నాలుగుకాదు ఐదుతరాలు ఒకే చోట ఒకే సమయంలో నివసించిన కుటుంబంలో నా తొలి ఇరవై యేళ్ళు గడిచాయి. నర్సాపురం టేలర్ పేట మసీదువీధి నా జన్మస్థలం. నిజానికి అది వీధికాదు అదొక నమూనా గ్రామం. అది తనకు తానుగా ఒక నాగరీకత. వంటశాలలు, భోజనశాలలు, గొడ్లకొష్టాలు, అశ్వశాలలు, ధాన్యం గాదెలు, కళ్యాణమంటపాలు, మసీదు, స్మశానం అన్నీ మాకు ఆ వీధిలోనే. ఒక్కమాటలో చెప్పాలంటే మాకు జననం, జీవనం, మరణం మూడూ ఒక్కచోటే.
నా ఇరవయ్యవో యేట మా బడీనాని ఫౌజున్నీసా చనిపోయింది. ఆమె మా అమ్మమ్మకు అమ్మమ్మ. ఫౌజున్నీసా (100), మీురాంబీ (80), ఫాతిమున్నీసా (60), సుఫియాబేగం(40), యజ్దాని(20) - 1971 నాటికి మా సజీవ వంశవృక్షం ఇది. కుటుంబ జనాభా ఎంతో వేళ్ళ మీద లెఖ్ఖించడం కష్టం. కాగితం, కలం తీసుకుని లెఖ్ఖలు కట్టాల్సిందే.
వంటలు, ఆహారపు అలవాట్లలో మాది బడీనానీ సాంప్రదాయం అంటారు. నాకు ఊహ వచ్చేనాటికే బడీనానీ వంట చేయడం మానేసింది. పత్యం కోసం చలికాలంలో ఆమె గంగరావి ఆకులు, బియపురవ్వ, బూరుగుపల్లి బెల్లం, నెయ్యితో పిట్టు చేసిపెట్టేది. రంజాన్ పండగ రోజున షీర్ ఖుర్మా తయారీని పర్యవేక్షించేది. బడీనానీ వంటల గురించి అవి మాత్రమే గుర్తున్నాయి. తరాలు మారేకొద్దీ వంటల్లో శుచి, రుచి రెండూ తగ్గిపోతున్నాయని ఆమె ఎప్పుడూ అసహనంగావుండేది.
క్రమంగా, నెయ్యి, నువ్వుపప్పునూనె, నువ్వులనూనె పోయి 1960వ దశకంలో వాలాజీ (బహుశ బాలాజీ) బ్రాండు వేరుశనగ నూనె డబ్బా ప్రవేశించింది. కుటుంబంలో అందరికీ దురదలు పట్టుకున్నాయి. నానీకి మాత్రం నేతి వంటలే చేసేవారు. ఓరోజు బడీనానీ లాల్ దలాన్ (ఎర్రహాలు)లో నిలబడి ''యా అల్లా! నాకు ఈ నూనె కూడా రాసిపెట్టావా?'' అని గట్టిగా విలపించడం నాకిప్పటికీ గుర్తు.
మా జమానా వంటల్లో మా అమ్మమ్మదే పైచేయి. విచిత్రం ఏమంటే, మా అమ్మమ్మ చేసిన వంటలు ఆమె తల్లి మీరాంబీకి నచ్చేవికావు. ఆ వయసులోనూ మీరాంబీ తనవంట తనే చేసుకునేది.
వృధ్ధాప్యంలో మా అమ్మమ్మకు కూడా మా అమ్మ వంటలు నచ్చేవికావు. అమ్మచేతి వంట ఎవరికైనా అద్భుతంగావుంటుంది. దానికి కొంత కారణం సెంటిమెంట్ కావచ్చు. సెంటిమెంట్ లేకపోయినాసరే మా అమ్మ చేతివంట అద్భుతంగా వుండేది; మా అమ్మమ్మకుతప్ప.
తిండి విషయంలో నావన్నీ మా అమ్మమ్మ లక్షణాలే అంటారు. వంట రుచి చూడాలంటే నన్నే పిలిచేవారు. నేను ఒకరకంగా కుటుంబ టేస్టర్ ని అన్నమాట!. ''వీడిది అచ్చం ఫాతిమున్ నాలుక'' అనేవారు. చిటికెడు వంటకాన్ని నోట్లో పెట్టుకోగానే సంపూర్ణ విశ్లేషణ నివేదికని ఇచ్చేసేవాడ్ని. ఈ అభ్యాసం మొదట్లో బాగానేవుండేదిగానీ, తరువాత్తరువాత కొంచెం ఇబ్బందిగా మారింది. ప్రేమతో ఏదైనా పెట్టీపెట్టగానే దాంట్లోని లోపాల్ని ఏకరువు పెడితే ఎవరుమాత్రం భరిస్తారు?
తిండి విషయంలో మా అమ్మమ్మకు చాలా గట్టి ఇష్టాఇష్టాలు వుండేవి. తనకో అభిప్రాయం ఏర్పడిందంటే అది శిలాశాసనమే! దాన్ని కొంచెం కూడా మార్చుకోవడానికి ఇష్టపడేదికాదు. మిగిలినవాళ్ళు కూడా దాన్నే అనుసరించాలనుకునేది.
మా అమ్మమ్మ దృష్టిలో అరటి పండు అంటే చక్కెరకేళీ ఒక్కటే. అమృతపాణీని దయతలిచి కొంతవరకు భరించేది. కర్పూరపు రకాలంటే ముక్కు విరిచేది. పైగా కర్పూరపు అని పలకలేక కాఫిరీ అనేది. కాఫిర్ అంటే అవిశ్వాసులు అని అర్థం. మామిడి పండ్ల విషయంలోనూ అంతే. రసాలంటే ఎంతో ఇష్టపడేది. ఆ తరువాతి స్థానం బంగినపల్లీదే. కలెక్టర్ (తోతాపూరి) రకాల్ని చీత్కారంగా చూసేది.
నాణ్యతలోనేకాదు పరిమాణంలోనూ మా అమ్మమ్మకు నిశ్ఛితాభిప్రాయాలుండేవి. ఆమెకు అరటి పళ్ళు ఇవ్వాలంటే అత్తమో, అరడజనో ఇవ్వాలి. మామిడిపళ్ళు పాతికో, పరకో ఇవ్వాలి. అంతకన్నా తక్కువ ఇస్తే తనను అవమానిస్తున్నారనుకునేది. జీర్ణశక్తి నశించిన చివరి రోజుల్లోనూ పరిమాణం విషయంలో రాజీపడేదికాదు. కాకుంటే తన వాటాలోవచ్చిన తినుబండారాల్ని మనవళ్ళకు ఇచ్చేసేది. దేన్ని స్వీకరించాలనుకున్నా, అతిథిలా గౌరవించి ప్రత్యేకంగా ఇచ్చారా? లేకుంటే పదిమందితోపాటూ తబురూక్ (ప్రసాదం) లా పంచారా? అనేది నిర్థారించుకోవడం ఆమెకు అన్నింటికన్నా ముఖ్యం.
దానశీలికీ, పిసినారికీ తేడా వెంట్రుకవాసియేనని మా అమ్మమ్మ తరచూ అంటుండేది. రుచికరమైన వంటకూ, పాడైపోయిన వంటకూ తేడా కూడా వెంట్రుక వాసేనని ఆమె అభిప్రాయం. రెండింటికీ అవే దినుసులు, అదే ఖర్చు, అంతే సమయం తేడాఅల్లా శుచీ, రుచే అనేది.
మా అమ్మమ్మ పేరిట నిలిచిపోయే వంటకాలు కొన్నున్నాయి. అవి నేతి పరోటాలు-కోడిగుడ్డుపొరట, పచ్చిజీడిపప్పు-వేటమాంసం, కొబ్బరిపాలు-వాక్కయలపులుసు, కొబ్బరిరొట్టె-చేపలకూర, చింతకాయ-చేపలపులుసు, (మా అమ్మమ్మ ఆత్మ శాంతించుగాక) చేపల కూర అనే పదప్రయోగం మా కుటుంబంలో నిషేధం. పండుగొప్ప, చందువా, పొలస, శీలవతి, వంజరం, మోసు, రహు, బొమ్మీడాయిలు, రావలు అని చెప్పాలి. ఇవన్నీ సముద్రపు రకాలు. బొచ్చె, రాగండి వంటి చెరువు రకాల తెల్ల చేపలు నర్సాపురం ప్రాంతంలో అప్పటికి ప్రధాన స్రవంతిలోనికి చేరలేదు.
చేపలు వండడానికి మచిలీపట్నం, నర్సాపురం, కాకినాడ, బాపట్ల, చీరాల ప్రాంతాలు ప్రసిధ్ధి. చేపలు తినడంలోనూ అనేక రీతులున్నాయి. హలాల్ చేయని మాంసాహారాన్ని ముస్లింలు ముట్టుకోరు. అయితే, చేపలకు హలాల్ నుండి మినహాయింపు ఉంది. చేపల్లో సోర చేపలవంటి స్థన్యజీవుల్ని ముస్లింలు తినరు. చేపల్లోనూ మాంసాహారులు, శాఖాహారులూ వుంటాయి. మాంసాహార చేపలు సాధారణంగా సముద్రంలోనూ, నదుల్లోనూ వుంటాయి. వీటిని వైల్డ్ వెరైటీ అంటారు. చెరువుల్లో పండించే జాతులు సాధారణంగా శాఖాహార చేపలు. వీటిని వైట్ వెరైటీ అంటారు. పశ్చిమ బెంగాల్ లో బ్రాహ్మణులు కూడా చేపలు తింటారు. అయితే వాళ్ళు తెల్లరకాల శాఖాహార చేపల్నే తింటారు. ఈ కారణం చేతనే, కలకత్తాలో సముద్రం వున్నప్పటికీ, పశ్చిమబెంగాల్, అస్సామ్ రాష్ట్రాలు కైకలూరు, ఆకివీడు ప్రాంతాల నుండి చెరువు చేపల్ని దిగుమతి చేసుకుంటాయి.
నర్సాపురంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన చేపలు రావలు. గోదావరినది ముఖద్వారంలో, అంటే నది సముద్రంలో కలిసే చోట ఏర్పడే చిత్తడి నేలల్లో ఇవి విరివిగా దొరుకుతాయి. ఇతర సీజన్లలోనూ అప్పుడప్పుడు రావలు దొరకవచ్చుగానీ, వర్షాకాలం చివర్లో వచ్చే రావలు మరింత రుచిగా ఉంటాయి. దీపావళి పండుక్కి పక్షం రోజులు ముందూ వెనుకా, నెలరోజులపాటు నర్సాపురం పరిసరాల్లో మేలు రకం రావలు వస్తాయి.
పెన్నులా సన్నగా, గుండ్రంగా, నల్లగా, ఆరంగుళాల పొడవు వుండే రావల్ని ఆరగించడం రుచిగానేగాక, కళత్మకంగానూ వుంటుంది. మంచి సీజన్లో వచ్చే రావల కార్జ్యం మరింత రుచిగా వుంటుంది. మా అమ్మమ్మ అన్నంలో ఓ పాతిక, అన్నం తరువాత ఉత్తగా మరో పాతిక రావలు అవలీలగా తినేది.
రావలు రాక కోసం కొన్ని కుటుంబాలు కాచుక్కూర్చుంటాయంటే అతిశయోక్తికాదు. ముసలివాళ్ళు చివరి కోరికగా చేపల కూర తినాలనుకునే సాంప్రదాయం గోదావరి తీరంలో కనిపిస్తుంది. చేప తెచ్చి, వండేలోపున చనిపోయిన వాళ్ళూ ఉంటారు. అలాంటి వాళ్ళ ఆత్మశాంతి కోసం దినం రోజు భోజనాల్లో చేపల కూర పెట్టేవారు.
రావలు మీద వల్లమాలిన అభిమానంతో పతనమైపోయిన కుటుంబాలు కూడా కొన్నున్నాయి. పాతనర్సాపురం పెద్ద మసీదు సమీపాన మాలీంవీధి అలాంటి కుటుంబాలకు నిలయం. మాలీం అంటే నావికుడు. మాధవాయిపాలెం, వలందర్ (హాలెండ్) రేవు ప్రపంచపటంపై ఒక వెలుగు వెలిగిన కాలంలో నర్సాపురం నుండి చేనేత వస్త్రాలు, పప్పు రొయ్యలు ఎగుమతి అయ్యేవి. రంగూన్ నుండి కలప, బాసుమతి బియ్యం, చీనీ చీనాంబరాలు దిగుమతి అయ్యేవి. సముద్ర వ్యాపారంలో ముస్లింలదే పైచేయిగావుండేది. మాధవాయిపాలెం రేవుపై ఆధిపత్యాన్ని సాధించడానికి బ్రిటీష్, డచ్ సేనలు 17,18 శతాబ్దాల్లో భీకరంగా తలపడ్డాయంటే నర్సాపురం వైభవాన్ని ఊహించుకోవచ్చు. ఆ కాలంలో మాలీంవీధికీ ఘనమైన చరిత్రేవుంది. ఆ వీధిలో అన్నీ మండవాలోగిళ్ళే. కొన్ని ఇళ్ళకు రెండు మూడు మండువాలు కూడా వుండేవి.
నర్సాపురం రేవు పతనం తరువాత సహజంగానే మాలింవీధి శకం ముగిసింది. ఒకప్పుడు కళకళలాడిన అ మండువా లోగిళ్లలో పేదరికం తాండవమాడింది. మనుషులులేక, గదులన్నీ బోసిగా శిధిలమైపోతూ వుండేవి. మగవాళ్లందరూ చనిపోగా, వృధ్ధాప్యంలో మగ్గుతున్న ఒకరిద్దరు మహిళలు ఆ లోగిళ్లలో బతుకును వెళ్లదీస్తుండేవారు. వాళ్ళను చూసి పిల్లలు దడుచుకునేవారు.
మేలు రకం రావలు వర్షాకాలం మధ్యలో వస్తాయి. ఆదీ ఒక్క నెలే వస్తాయి. అప్పుడు తినలేకపోతే మళ్ళీ ఏడాది వరకు దొరకవు. మరుసటి ఏడాది వరకు బతకే ఆశలేనోళ్ళు ఎలాగైనా రావలు తినితీరాలనుకునేవాళ్ళు. చివరిసారిగా రావలు తిని చనిపోవాలనే కోరికతప్ప వాళ్ళకు, బతుకు మీద మరే ఆశ లేదేమో అనిపించేది. కానీ, రావలు కొనాలంటే మాటలా? బోలెడు ఖరీదు. డబ్బులెక్కడివీ? రావల పేరు ప్రఖ్యాతులు ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించడంతో నర్సాపురం చేపల బజార్లో వాటి గిరాకీ పెరిగిపోయింది.
పెంకుటిళ్లను వర్షాకాలంలో నేయడం ఆనవాయితీ. సరిగ్గా రావలు వచ్చే సీజన్లోనే పెంకులకూ మంచి గిరాకి వుండేది. కొత్త పెంకులు కొనలేనివాళ్లు పాత పెంకులను కొనుక్కుని ఇళ్ళు నేయించుకునేవారు. మాలింవీధి వృధ్ధమహిళలు రావలు తినాలనుకున్నప్పుడెల్లా ఇంటికప్పు మీది పెంకులు ఓ వంద అమ్మేసేవారు. ఒక్కో ఏడాదికి ఒక్కో గది పైకప్పు ఖాళీ అయిపోయేది. క్రమంగా పెంకులన్నీ మాయమైపోయి, ఆ లోగిళ్ళన్నీ బోసిగా దర్శనమిచ్చేవి. కేవలం వంటగదుల కప్పులకు మాత్రమే పెంకులు మిుగిలేవి. ఒకనాడు ఆ లోగిళ్ళకు మహరాణులుగా వెలిగిన ఆ మహిళలకు చివరి ఘడియల్లో వంటగదులే నివాసంగా మారేవి. పొగచూరిన ఆ చిన్నిగదుల్లో బూడిదమారిన వాళ్ల బతుకులు కాలంతీరేవి. వాళ్లవెంట ఆ వంటగదులూ కూలిపోయేవి.
అల్లా వాళ్లకు స్వర్గంలోనూ రావలు ఇవ్వుగాక!
వసంత కోసం, 1-9-2007
ఏ.యం. ఖాన్ యజ్దానీ (డానీ)
రావలు అనే చేపల కథ పై
ప్రతిస్పందన
1
గతము
మతము
ప్రాంతము
వంటకము
సౌందర్యము
- టీ. ప్రకాష్
( సీనియర్ పాత్రికేయులు)
2.
మా పెద్దబ్బాయి యజ్దానీ రాసిన కథ చదివాను. అప్పటి విషయాలు గుర్తు పెట్టుకుని బాగారాసాడు. చేపల పేర్ల విషయంలో మావాడు కొంచెం పొరపడ్డాడు. శీలవతి, వంజరం, బొమ్మిడాయిల్ని మా కుటుంబాల్లో తినేవారుకారు. మేము తినే చేపలు ఐదేఐదు. పండుగొప్ప, చందువా, రావలు, మాతగొర్క, సొఠారు. సొఠారును మేము 'సాస్ మారీ ఠోలా' (అత్త కొట్టిన ముట్టికాయ) అంటాము. పొలస చేపకు నర్సాపురంకన్నా రాజమండ్రి ప్రసిధ్ధి.
మాలీంవీధి, పఠాన్ వీధి ఆడవాళ్ళు పచ్చి జీడిపప్పు కూర కోసం కార్చూపీ పట్టు లహెంగాలు, అచ్ కన్ (షేర్వాణి) లు అమ్ముకునేవారు. కార్చూపీ లహెంగాలు ఇవ్వాల్టి రోజుల్లో లక్ష రూపాయలు పెట్టినా రావు. యజ్దాని ఆ కథ కూడా రాస్తే బాగుంటుంది. ఈషాల్లా!
- సఫియా బేగం, సఫీల్ గుడా, హైదరాబాద్
3
- ఖాదర్ మొహియుద్దీన్, విజయవాడ
4
డానీతో గడిపిన రాత్రుళ్ళలో అలాంటి అనుభవాలు కోకొల్లలుగా జాలువారుతుంటాయి. అపారమైన డానీ అనుభవాన్ని వ్యక్తిగతమైనదని కొట్టిపడేయలేము. అందులో చరిత్ర, సంస్కృతీ, వంటకాలు అన్నీవుంటాయి. వాటిని గ్రంధస్థంచేయమని అడగనివారుండరు.
- గడియారం శ్రీవత్స, హైదరాబాద్
No comments:
Post a Comment